రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్తో ఆకర్షిస్తోన్న కియా మోటర్స్ కూడా ఈవీ కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే కియా మోటర్స్ ఈవీ6 విద్యుత్ కారును ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఈవీ6 విద్యుత్ కారును భారత విపణిలో అవిష్కరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఎస్యూవీ మోడల్కు చెందిన ఈ కియా ఈవీ6 కారు పొడవు దాదాపు 4.7 మీటర్లగా తెలుస్తోంది. ఈ కారును ఐదు మోడళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉంది.
3 రకాల బ్యాటరీ ప్యాక్లతో 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే సదుపాయం కూడా ఈ కారుకు ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కారును తొలి దశలో పూర్తిగా కొరియా నుంచి దిగుమతి చేసుకుని, మనదేశంలో విక్రయిస్తారని, తదుపరి మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. దేశీయంగా ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విద్యుత్తు వాహనం ధర రూ.50-60 లక్షలు ఉండే అవకాశం ఉంది.
