భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 2026 మార్చి నెల ఒక అత్యంత గడ్డు కాలంగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా దలాల్ స్ట్రీట్లో విదేశీ ఇన్వెస్టర్లు ప్రదర్శిస్తున్న అమ్మకాల జోరు చూస్తుంటే.. మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కేవలం ఒకే వారంలో సుమారు రూ. 35,475 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు (FPI) బయటకు వెళ్లిపోవడం అనేది ఒక సాధారణ విషయం కాదు.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్న ప్రధాన అంశం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చితి నెలకున్నప్పుడు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. వారు తమ పెట్టుబడులను భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచిఉపసంహరించుకుని, సురక్షితమైన ఆస్తులుగా భావించే బంగారం లేదా అమెరికా డాలర్ల వైపు మళ్లుతారు. దీనినే ఆర్థిక పరిభాషలో ‘రిస్క్-ఆఫ్’ (Risk-off) విధానం అంటారు.
ముడి చమురు సెగ…
భారతదేశం తన చమురు అవసరాలలో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియాలో దాడులు పెరగడం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయం మార్కెట్లో నెలకొంది. దీనివల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం రవాణా రంగంపై పడి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు.. ఇది కంపెనీల లాభాలపై దెబ్బకొడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ముప్పును ముందే పసిగట్టి తమ వాటాలను విక్రయిస్తున్నారు.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను (FPIs) తరచుగా ‘హాట్ మనీ’ అని పిలుస్తారు. ఎందుకంటే వీరు లాభాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్తారు.. ముప్పు కనిపిస్తే అంతే వేగంగా బయటకు వచ్చేస్తారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) డేటాను పరిశీలిస్తే… ఈ వారం అమ్మకాల పరంపర షాక్కు గురిచేస్తోంది. సోమవారం అత్యధికంగా రూ. 10,827 కోట్ల ఉపసంహరణతో వారం ఘోరంగా ప్రారంభమైంది. మంగళవారం, బుధవారం వరుసగా రూ. 9,406 కోట్లు, రూ. 4,376 కోట్లు వెనక్కి వెళ్లాయి. శుక్రవారం ఒకరోజు విరామం (సెలవు) తర్వాత మళ్లీ రూ. 10,965 కోట్ల భారీ అమ్మకాలు జరిగాయి. ఇలా మొత్తం రూ.50 వేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి.
Also Read:Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్కు గ్రీన్ సిగ్నల్..
మొత్తంగా ఈ మార్చి నెలలో ఇప్పటివరకు రూ. 88,180 కోట్లు బయటకు వెళ్లడం 2026లోనే అతిపెద్ద రికార్డు. ఇది మార్కెట్ సెంటిమెంట్ ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. విదేశీయులు ఇంత భారీగా అమ్ముతున్నా, భారత మార్కెట్ పూర్తిగా కుప్పకూలకపోవడానికి ప్రధాన కారణం దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII), రిటైల్ ఇన్వెస్టర్లు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తున్న సిప్ (SIP) పెట్టుబడులు మార్కెట్కు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. విదేశీయులు అమ్ముతున్న షేర్లను దేశీయ సంస్థలు కొనుగోలు చేస్తూ మార్కెట్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. విదేశీ అమ్మకాల ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, దేశీయ పెట్టుబడులు కూడా ఎంతవరకు నిలబడతాయనేది ప్రశ్నార్థకమే.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ నిపుణులు ఒకటే సూచిస్తున్నారు: ‘కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు’ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు కుదుటపడే వరకు మార్కెట్లలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. వాల్యుయేషన్ల పరంగా కొన్ని షేర్లు ఇప్పుడు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నప్పటికీ.. గ్లోబల్ పరిస్థితులు సానుకూలంగా మారే వరకు వేచి చూడటం ఉత్తమం. ముఖ్యంగా ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్పై కన్నేసి ఉంచడం ద్వారా మార్కెట్ గమనాన్ని అంచనా వేయవచ్చు.