ప్రముఖ కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ (HUL) సామాన్యులకు మరోసారి షాకిచ్చింది. గత ఏడాది నవంబరులోనే పలు ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్యూఎల్ తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్ సబ్బుల ధరలను 3 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.
తాజా ధరల ప్రకారం బట్టలు ఉతికేందుకు ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్ సబ్బు ధర రూ.10 నుంచి రూ.12కి పెరిగింది. పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి 83కి పెరిగింది. 500 గ్రాముల వీల్ పౌడర్ ధర రూ.30 నుంచి రూ.31కి పెరిగింది. రిన్ 250 గ్రాముల సబ్బు ధర రూ.18 నుంచి రూ.19కి పెరిగింది. స్నానానికి ఉపయోగించే లైఫ్బాయ్ 125 గ్రాముల సబ్బు ధర రూ.29 నుంచి రూ.31కి పెరిగింది. కాగా హిందూస్థాన్ యూనీలివర్ బాటలోనే మరిన్ని కంపెనీలు ధరలు పెంచే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.