భారత్లో వంట నూనెల ధరలు మంట పెట్టాయి.. సామాన్యుడు వంట నూనె కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కొన్ని బ్రాండ్ల నూనెల ధరలు ఓపెన్ మార్కెట్లో ఏకంగా 200కు చేరువయ్యాయి.. గత కొన్ని రోజులుగా క్రమంగా పైకి ఎగబాకుతూ పోయాయి.. అయితే, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలశాఖ ప్రకటించింది.. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.. పామ్ ఆయిల్ ధర 19 శాతం తగ్గి, కిలో రూ.115కు చేరగా.. సన్ఫ్లవర్ ఆయిల్ ధర 16 శాతం తగ్గి కిలో రూ.157కు చేరిందని తన ప్రకటనలో పేర్కొంది పౌరసరఫరాల శాఖ. ఇక, గణాంకాల ప్రకారం, గత ఏడాదిగా వేరుసెనగ నూన్, ఆవ నూనె, వనస్పతి, సోయా ఆయిల్, సన్ఫ్లవర్, పామాయిల్ వంటి 6 వంటనూనెల ధరలు 20 శాతం నుంచి ఏకంగా 56 శాతం వరకూ పెరుగుతూ పోయాయి..
ఆ గణాంకాల ప్రకారం ఆవనూనె ధర గత ఏడాది మే 28 నాటికి రూ.117 ఉండగా, ఈ ఏడాది మే 28కి రూ.171కి ఎగబాకింది.. సోయా అయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు 50 శాతానికి పెరిగాయి. 2021 మే నాటికి ఈ ఆరు వంటనూనెల ధరల పెరుగుదల 11 ఏళ్ల గరిష్టానికి చేరి ప్రజలకు గుదిబండలా మారాయి.. అయితే, అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీయ ధరలపై పడినట్టు చెబుతున్నారు అధికారులు.. వంటనూనెల పరంగా దేశ అవసరాల కోసం 56 శాతం దిగుమతులపై ఆధారపడడమే దానికి ప్రధాన కారణం అంటున్నారు.. తాజాగా.. దాదాపు 20 శాతం వంట నూనెల ధరలు తగ్గడం సామాన్యులకు కాస్త ఉపశమనంగా చెప్పాలి.