Surya Grahanam 2025: హిందూ మతంలో సూర్య గ్రహణానికి ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. సెప్టెంబర్ నెలలో అంటే ఒకే నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఇలా రావడం అపశకునంగా భావిస్తారు. అయితే.. రేపు ఆదివారం అమావాస్య. అంతే కాకుండా.. పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. అయితే.. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. రేపు రాత్రి 11 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. మరుసటి రోజు (సెప్టెంబర్ 22) తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. హిందూ ఆచారాల ప్రకారం.. సూర్యగ్రహణం నాడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
READ MORE: Mulugu : ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖలు..అలర్ట్ అయిన పోలీసులు
నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న నియమాల ప్రకారం.. సూర్యగ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. గ్రహణం మొదలైనప్పుడు, పూర్తైన తర్వాత స్నానం కచ్చితంగా చేయాలి. అలాగే వేడినీటితో స్నానం చేయకూడదు. చన్నీళ్ల స్నానం చేస్తే మంచిదట. రజస్వల దోషాలు ఉన్నవారు గ్రహణ సమయంలో స్నానం చేయాలని సూచిస్తున్నారు. పురుడు(ఎవరైనా జన్మించినప్పుడు), సూతకం(మైల)లో ఉన్నవారు కూడా స్నానం చేయాలని చెబుతున్నారు. ఈరోజున తలస్నానం చేయాలని, తలంటు స్నానం చేయొద్దని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే గ్రహణం ముందు వండిన ఆహారాన్ని గ్రహణం పూర్తైన తర్వాత తినకూడదని చెబుతున్నారు. మళ్లీ వండుకుని అప్పుడు తినాలని సూచిస్తున్నారు. గర్భణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది.