Tesla: ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్ఓవర్లను ప్రదర్శించనున్నారు. జూలై చివరి నాటికి న్యూఢిల్లీలో రెండో షోరూం తెరవాలని టెస్లా భావిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో లేదు. లాభాల కన్నా, బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇతర దేశాల నుంచి టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకువస్తోంది.
Read Also: Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
టెస్లా దాని ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. కంపెనీ అమ్మకాలు గత త్రైమాసికంలో పడిపోయాయి. అమెరికన్ కంపెనీకి, చైనీస్ కంపెనీ అయిన BYD నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
మోడల్ Y ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రమే దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా, లగ్జరీ వాహన కొనుగోలుదారులకు టెస్లా ఒక మంచి ఎంపిక అవుతుంది. టెస్లా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీదారులతో పోటీపడబోతోంది. మన దేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందించే టాటా, మహీంద్రాలతో పోటీ ఉండే అవకాశం లేదు.