టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. 14 ఏళ్ల ముఖ్యమంత్రివా లేక వీధి రౌడివా? అంటూ కామెంట్ చేసిన ఆమె.. “యథా రాజా తథా ప్రజా” అంటారు.. అయితే ఇప్పుడు అది తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకే సరి పోతుందని ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ – నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయమంటూ మండిపడ్డారు.. కుప్పంలో కనీసం ఇల్లో, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రోజు కుప్పం ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదం అన్నారు.
మరోవైపు.. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతైంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించిన ఆమె.. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి.. ఇలా ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితులు లేవని.. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికే పట్టం కడుతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. పార్టీ క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే.. చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలి పోతారంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా.