YS Jagan Pulivendula tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు జగన్.. అనంతరం అరటి రైతుల వద్దకు వెళ్లిన జగన్ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. రెండవ రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను ఆయన కలిశారు.. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి యోగక్షేమాలు తెలుసుకుని భరోసా కల్పించారు..
Read Also: Top Selling Motorcycles: మరోసారి సత్తా చాటిన బడ్జెట్ బైక్.. అమ్మకాల్లో టాప్ 10 బైకులు ఏవంటే..?
బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించిన అనంతరం అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.. 18 నెలల చంద్రబాబు హయాంలో 16 సార్లు రకరకాల విపత్తులు సంభవించాయన్నారు.. చంద్రబాబు హయాంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది సున్నా.. ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.. ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్తు సంభవించినా ఇన్సూరెన్స్ లేదు అని మండిపడ్డారు జగన్..
అదే, వైసీపీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రైతును ఆదుకునే పరిస్థితి ఉండేది అన్నారు జగన్.. సబ్సిడీ విత్తనాలు లేవు. ఎరువులు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది.. తొలిసారి రైతులు యూరియాను బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది.. వైసీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకున్నాం.. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ఇవ్వాల్సిన మొత్తం నిలిపివేశారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వంలో అరటి పంటకు నష్టం వాటిల్లితే పట్టించుకునే నాథుడు లేదు.. గతంలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేశాం.. అరటి మాత్రమే కాదు, మిర్చీ, పొగాకు, చీని, పసుపు ఇలా ప్రతీ పంటకు గిట్టుబాటు ధర లేదు.. చంద్రబాబు మనిషే కాదు.. చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది.. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.. మొత్తం మీద జగన్ పులివెందుల పర్యటనకు మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..