రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్, అక్కడ మోహన్ అనే యువకుడి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. మోహన్ ఎంతో ఉత్సాహవంతుడని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్ కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి కొత్త జవజీవాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీను పాత్రను జగన్ ప్రస్తావిస్తూ, మోహన్ను తన సొంత తమ్ముడిగా భావించి అతని గెలుపు కోసం శ్రీను కృషి చేస్తున్న తీరును అభినందించారు. శ్రీను స్వయంగా మోహన్ గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడని, ఈ ప్రయాణంలో తాను కూడా శ్రీనుకు తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీను కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని, అతనికి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తానని జగన్ స్పష్టం చేశారు.
సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు , కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, అందరినీ వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవకాశం ఉన్నప్పుడల్లా క్షేత్రస్థాయి కార్యకర్తలను తన వద్దకు తీసుకురావాలని శ్రీను, మోహన్లకు సూచించారు. తన మీద నమ్మకం ఉంచి పార్టీ విజయం కోసం పగలు రేయి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, సోదరులకు, అక్కాచెల్లెమ్మలకు , పెద్దలకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన పునరుద్ఘాటించారు.
