జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని, 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని హెచ్చరించింది. లాక్డౌన్ తదితర కారణాల వలన కౌంటర్ దాఖలు చేయలేకపోయినట్టు జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. సీబీఐ నుంచి తమకు ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.