ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐదు కీలక టవర్ల నిర్మాణ వ్యయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పేరుతో రూ. 1,100 కోట్లు ఖర్చు చేసి, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్త నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక భవనాల కోసం ఖర్చు చేసిన ఆ నిధులన్నీ ఇప్పుడు గంగలో పోసినట్టేనని ఆయన మండిపడ్డారు.
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
రాజధానిలో నిర్మిస్తున్న ఐదు టవర్ల వ్యయంపై జగన్ గణాంకాలతో సహా విరుచుకుపడ్డారు. మొదట ఈ టవర్లకు రూ. 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే, మళ్ళీ ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి పనుల కోసం అదనంగా రూ. 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని, వీటికి తోడు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం మరో రూ. 1,053 కోట్లు కేటాయించారని తెలిపారు. మొత్తం 52.20 లక్షల చదరపు అడుగుల వైశాల్యానికి గాను, ఒక్కో స్క్వేర్ ఫీట్కు సగటున రూ. 14,795 ఖర్చవుతోందని, హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరాల్లో అత్యుత్తమ నిర్మాణాలకే రూ. 4,500 కంటే ఎక్కువ ఖర్చు కాదని ఆయన గుర్తు చేశారు. ఉచిత ఇసుక వంటి మినహాయింపులు ఉన్నప్పటికీ ఇంత భారీ రేట్లు ఉండటం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
అమరావతి ఖర్చు ఎంత విపరీతంగా ఉందో చెప్పడానికి జగన్ కొన్ని జాతీయ స్థాయి ఉదాహరణలను ఉటంకించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక సెక్రటేరియట్ భవనానికి కేవలం రూ. 615 కోట్లు మాత్రమే ఖర్చయ్యిందని, అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మక కొత్త పార్లమెంట్ భవనం వ్యయం కూడా కేవలం రూ. 970 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. ఒకవైపు పార్లమెంట్ , పొరుగు రాష్ట్ర సెక్రటేరియట్ వెయ్యి కోట్ల లోపు పూర్తవుతుంటే, ఏపీలో మాత్రం ఐదు టవర్లకే వేల కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని జగన్ ప్రశ్నించారు. ఈ అంకెల గారడీపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.