Yarapathineni Srinivasa Rao Sensational Comments On YS jagan Mohan Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలో నిర్వహించిన బీసీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ దాడిలో కారు 20 అడుగులు పైకి లేచి కిందపడినా చంద్రబాబు బతికారని, అదీ ఆయన మంచితనమని పేర్కొన్నారు. కానీ.. రాజశేఖర్ రెడ్డికి పావురాళ్లు గుట్టలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో గుర్తుందా? అని ప్రశ్నించారు. అదే గతి నీక్కూడా పడుతుంది.. గుర్తు పెట్టుకో జగన్ అని హెచ్చరించారు.
ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో గురజాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా.. విధ్వంసకాండ, ఫ్యాక్షన్ హత్యలకు తెరలేపారని యరపతినేని ఆరోపణలు చేశారు. 9 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, కాపు నాయకులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ఇసుక, నిత్యవసర సరుకులు, విద్యుత్ చార్జీలు పెంచి.. సామాన్యుల నడ్డీ విరిచారని మండిపడ్డారు. బీసీలు ఎన్టీఆర్ వెంట నడిచి కేంద్ర మంత్రులయ్యారని చెప్పారు. కానీ మీరు మాత్రం బీసీలపై ధృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నారని, పైకి మాత్రం బీసీ కులస్తులకు మాత్రమే న్యాయం చేస్తున్నామని మాయమాటలు చెప్తున్నారంటూ జగన్పై విరుచుకుపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని.. ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాలు ఉండగానే బీసీ శంఖారావం మొదలుపెట్టామని చెప్పారు.
మార్కెట్ యార్డ్ నిధుల ద్వారా ఒక్క రోడ్డు గానీ, రైతులకు నిధులు గానీ కేటాయించలేదని యరపతినేని విమర్శించారు. వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వచ్చి గ్రామంలో సభ పెట్టుకుంటుంటే.. పిడుగురాళ్ల ఆఫీసులో ఉండి ఆ సభకు ఎవరు వెళ్లకూడదని ఉక్కును చారి వచ్చేసింది నువ్వు కదా? అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎస్పీకి ఒక హెచ్చరిక కూడా చేశారు. మీ ఎస్ఐలను కంట్రోల్లో పెట్టుకోవాలని.. లేకపోతే పోలీస్ స్టేషన్లో 30 మంత్రి పోలీసులుంటే, గ్రామంలో 35 వేల మంది ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరగరానిది ఏదైనా జరిగితే.. దానికి బాధ్యత మీదేనని పేర్కొన్నారు.