Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీ మెకానిక్గా పని చేస్తున్న షేక్ అహ్మద్ ఎనిమిది నెలల క్రితం క్రాంతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు టిడ్కో ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, గురువారం రోజు రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచడంతో దాన్ని తగ్గించాలని అహ్మద్ పలుమార్లు సూచించాడు.
Read Also: Stock Market: స్టాక్ మార్కెట్కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
అయితే, టీవీ సౌండ్ తగ్గించమని చెప్పే విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో షేక్ అహ్మద్ భార్య క్రాంతిపై చేయి చేసుకున్నాడు. వివాదం ముదరడంతో.. క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో భర్తను పొడిచేసింది. దీంతో అహ్మద్ కేకేలు వేయడంతో స్థానికులు హుటాహుటిన అతణ్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, అప్పటికే షేక్ అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
