రాష్ట్రంలో అధికార పార్టీకి, మా చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత లేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర రహదారులు , జాతీయ రహదారుల మీద ప్రజల్లో చర్చకు వైసీపీ ప్రభుత్వం వస్తుందా? రాష్ట్రంలో దాదాపు 90 వేల కోట్లు పైబడి నిధులతో జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రహదారులకు చేయవలసిన చిన్న చిన్న మరమ్మతులకు సైతం గుత్తేదారులు పాల్గొనకుండా పారిపోతున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారుల టెండర్లలో దాదాపు 20 శాతం పైబడి తక్కువ ధరకు టెండర్లు వేసి ముందుకు వస్తున్నారు. అదే సందర్బంలో రాష్ట్రంలో మాత్రం పరిస్థితి కేంద్రానికి భిన్నంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం వైకాపా ప్రజాప్రతినిధుల దౌర్జన్యం , అవినీతి గుత్తాధిపత్యం , ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడం కారణం కాదా అని రాష్ట్ర బీజేపీ ప్రశ్నిస్తోందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
రాష్ట్రం వైసీపీ పగ్గాలు చేపట్టిన నాటినుండి రహదారులు గాలికి వదిలేసింది. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో కలిపే రహదారులను ₹6,400 తో రెండు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన కేంద్ర రాష్ట్రానికి సూచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నిధులలో 70 శాతం వాటా న్యూ డెవలస్ మెంట్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారాన్ని తెలియజేసింది. మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించవలసి ఉంటుందన్నారు.
ఇందులో మొదటి దశలో భాగంగా 1,243 కి.మీ.ల రహదారుల నిర్మాణం కోసం ఎన్ డి బి బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,978 కోట్ల నిధులను అందిస్తే, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 30శాతం ఇవ్వవలసిన సొమ్మును సైతం ఇవ్వలేదు. దీనితో ఈ పనుల కోసం టెండర్లు పిలిచి నేటికి దాదాపు పది నెలలు కావస్తున్నా రహదారుల మరమ్మతులను గుత్తేదారులు ప్రారంభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ నిధులు సైతం వెనక్కి పోనున్నాయి. దీనిమీద ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
నూతన భారతావని సాధనలో భాగంగా నరేంద్రమోడీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది ఇంకా నిర్మిస్తోంది. కాణిపాకం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల మీదుగా చిత్తూరు నుండి మల్లవరం వరకు నిర్మిస్తున్న NH-140, 6 వరుసల జాతీయ రహదారిలోని మిగిలిన పనులను NHAI శరవేగంగా చేపడుతోంది. ఈ పూర్తి రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పరంగా, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై అత్యంత శ్రద్ధ చూపుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు విష్ణువర్థన్ రెడ్డి.