విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి కాలేదు. తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్, అతని బంధువులు. బత్తిన అప్పలరాజుతోపాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శి్క్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు, పొరుగున నివసించే విజయ్ కుటుంబంతో పాత కక్షలున్నాయి. దీంతో అదను చూసి విజయ్ కుటుంబంపై దాడి చేశాడు అప్పలరాజు. ఇంట్లో ఉన్న ఆరుగుర్ని కత్తితో నరికి చంపాడు. విజయ్ తండ్రి బమ్మిడి రమణ, భార్య ఉషారాణి, రెండేళ్ల కొడుకు ఉదయ్, ఆరు నెలల కూతురు ఉర్విషను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు అప్పలరాజు. చుట్టపు చూపు కోసం వచ్చిన విజయ్ మేనత్తలు అల్లు రమాదేవి, నెకెట్ల అరుణను చంపాడు అప్పలరాజు
తన కుమార్తెతో విజయ్ ప్రేమ వ్యవహారం కారణంగానే అతని కుటుంబంలోని వాళ్లందరి అప్పలరాజు హత్య చేసినట్లు తెలుస్తోంది. 2018లో తన కుమార్తెతో విజయ్ ఫోన్ చాటింగ్ చేసినట్టు అప్పలరాజు గుర్తించాడు. దీంతో విజయ్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి విజయ్పై కక్ష పెంచుకున్నాడు అప్పలరాజు. ఈ క్రమంలోనే విజయ్ కుటుంబం మొత్తాన్ని హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.