Durga Temple Controversy: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస అపచార సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వరుస ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 27వ తేదీన అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ జరగగా, నిన్న ఉదయం నిర్వహించిన శ్రీచక్ర అర్చనలో మరో అపచారం చోటు చేసుకుంది. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే గో క్షీరంలో పురుగులు గుర్తించడంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను ఆపేశారు.
Read Also: Ayodhya: అయోధ్య రామ మందిరం సమీపంలో జోరుగా మద్యం, మాంసం.. యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
అయితే, అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాలు వినియోగించడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆలయ వాట్సాప్ గ్రూప్లో గోవు పాలు పంపాలని మెసేజ్ చేయడంతో.. సుమారు అరగంట తర్వాత ఆలయ సిబ్బంది గోవు పాలను తెచ్చారు. ఈలోగా అర్చన నిలిచిపోవడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. పాలు వచ్చిన తర్వాత శ్రీచక్ర అర్చనను తిరిగి కొనసాగించారు. ఇక, ఇదే సమయంలో నిన్న మధ్యాహ్నం మహా మండపంలో కేక్ కటింగ్కు ప్రయత్నం చేయడంతో మరో వివాదానికి దారి తీసింది. వరుస సంఘటనలతో కనకదుర్గమ్మ ఆలయ నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.