AP Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. బ్యాంకు వివరాలు, ఫోన్ నంబర్, పిన్ నంబర్లు రాబట్టి అందనికాడికి డబ్బులు దండుకోవడమే కాదు.. కొన్నిసార్లు మాయమాటలు, బెదిరింపులతో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు.. తాజాగా, విజయవాడ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి.. ఓ మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.. బాధితురాలు విజయవాడ భవానీపురానికి చెందిన మహిళా ఉద్యోగి.. రెండు దఫాలుగా 32 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లో వేశారు బాధిత మహిళ.. మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు.. ముంబై నుంచి సైబర్ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె.. రూ.32 లక్షలు వారు చెప్పిన ఖాతాలో వేశారు.. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read Also: Rambha: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
మరోవైపు గుంటూరులో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు బ్యాంకు ఉద్యోగి హేమంత్ కుమార్.. టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్లు ఇచ్చి.. రేటింగ్ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తామంటూ వలవేశారు ఆన్లైన్ మోసగాళ్లు.. అది గ్రహించని సదరు బ్యాంకు ఉద్యోగి.. మోసగాళ్లు మాటలు నమ్మి రూ.13 లక్షల పోగొట్టుకున్నాడు.. ఆ తర్వాత.. మోసపోయానంటూ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఇలా పలు రకాలుగా మోసాలకు తెరలేపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. వారితో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తు్న్నారు.