Site icon NTV Telugu

BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..

Bv Raghavulu Cpm

Bv Raghavulu Cpm

BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని అమెరికా ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను కూడా ఆయన విమర్శించారు.

Read Also: Iran-China: హార్ముజ్‌ను తెరిచి ఉంచండి.. ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహుతో జరిగిన సమావేశాలు, విందు భోజనాల నేపథ్యంలో భారత్.. ఇరాన్‌పై దాడులకు పరోక్ష మద్దతు ఇస్తోందన్న భావన కలుగుతోందని రాఘవులు విమర్శించారు.. భారత విదేశాంగ విధానాన్ని శాంతి, చర్చల దిశగా మళ్లించాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. యుద్ధ పరిస్థితుల్లో అక్కడి భారతీయుల రక్షణకు సమగ్ర కార్యాచరణ అవసరమన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్ల ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. అమెరికా విధించిన సుంకాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం కూడా దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఇక, మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని, విద్యుత్ చట్ట సవరణల ద్వారా పేదలపై ప్రతికూల ప్రభావం పడుతోందని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..

Exit mobile version