Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయోధ్య పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇక, ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఏ అంశాలపై చర్చించారో దేశానికి తెలియజేయాలని చింతా మోహన్ కోరారు. గాజాలో వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా భారత విదేశాంగ విధానం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. మోడీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంలో ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర అభివృద్ధిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఆ స్థాయి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మాటలకంటే పనులతో అభివృద్ధిని నిరూపించాలని సూచించారు చింతా మోహన్‌.. మరోవైపు.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని చింతా మోహన్ ప్రశ్నించారు. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా అని వ్యాఖ్యానించారు. రాజకీయ ఒత్తిడులకు న్యాయవ్యవస్థ లొంగుతోందనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు దళిత హోదా వంటి అంశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్..