Vanadurga Temple Washed Away In Godavari Floods: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో ఉన్న వనదుర్గ ఆలయం గోదావరి వరదలో కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది. వరద తాకిడికి తీరం కోతకు గురవ్వడంతో.. మధ్యాహ్నానికే ఆలయం ఓ పక్కకు ఒరిగింది. సాయంత్రానికి నదిలో పడి కొట్టుకుపోయింది.
ఆలయం పడిపోతోందన్న విషయం గ్రహించి.. అమ్మవారి మెడలో ఉన్న కొన్ని విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లారు. కానీ, పరిస్థితి చెయ్యి దాటడంతో వాళ్లు వెంటనే బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. గోదావరి గట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ వస్తున్నారు. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుప తవ్వకాలు చేపట్టడం వల్లే.. తీరం కోతకు గురై, ఆలయం ఇలా వరదలో కొట్టుకుపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.