Amit Shah and Junior NTR: అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీలో జరిగిన చర్చ ఇదే.. బయటపెట్టిన కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy

తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది.. ఎన్టీఆర్‌ను స్వయంగా అమిత్‌షానే ఆహ్వానంచడంతో ఏం జరుగుతోంది? ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారా? ఇలా అనేక రకాల చర్చకు దారితీసింది.. మునుగోడు బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌షా.. ఆ తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌కు చేరుకున్న తర్వాత.. ఎన్టీఆర్‌ ఆయనతో సమావేశం అయ్యారు.. దాదాపు అరగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు సాగాయి.. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన అమిత్‌షా.. అందులో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే పిలిచారానే ప్రచారం సాగింది.. కానీ, పొలిటికల్‌ సర్కిల్‌లో దీనిపై అనేక రకాలుగా చర్చ సాగుతోంది. అయితే, అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీకి సంబంధించిన అసలు విషయాలను బయటపెట్టారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..

Read Also: VishnuVardhan Reddy:అమిత్ షా-జూ.ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగింది

ఏపీలో పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతోన్న సమయంలో.. అమిత్ షా, ఎన్టీఆర్ సమావేశంపై ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు.. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఇద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. ఈ సమావేశంలో.. సీనియర్ ఎన్టీఆర్ గురించి అమిత్ షా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు కిషన్‌ రెడ్డి.. ఇక, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ మీట్ అవ్వాలని అమిత్ షా కోరారని స్పష్టం చేశారు. మరోవైపు, వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల గురుంచి స్పందించడానికి నిరాకరించారు కిషన్‌రెడ్డి.

కాగా, అమిత్ షా, ఎన్టీఆర్‌ సమావేశంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుండా ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని వ్యాఖ్యానించిన ఆయన.. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని.. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు.. ఇక, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్.. దీంతో, దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో.. చంద్రబాబును కూడా మధ్యలోకి లాగారు కొడాలి.. చంద్రబాబుతో ప్రయోజనం లేకపోవడంతోనే నరేంద్ర మోడీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు కొడాలి నాని.