గత వారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంభాషణను మొబైల్ వీడియో కటింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా కట్ చేసి దుష్ప్రచారంగా వాడుకుంటున్న దుండగులపై టీటీడీ సీరియస్ అయింది. ఎవరైతే దుష్ప్రచారం లో భాగంగా సామాజిక మాధ్యమాలలో వీడియోని కట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది టీటీడీ యాజమాన్యం. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అని టీటీడీ యాజమాన్యం హెచ్చరించింది.
పాలకమండలి సమావేశంలో శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన ధరల గురించి చర్చకు వస్తే వెంటనే స్పందించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తులపై ఎటువంటి భారం పడకూడదు అని పదే పదే చెబుతూ ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సిఫార్సులతో ఆర్జిత సేవలు కావాలని దరఖాస్తులు చేసుకుంటారో వారికి మాత్రమే ధరలు పెంచేలా గా చూడాలి అని బోర్డులో చెప్పడం జరిగింది. ఆర్జిత సేవలకు సంబంధించి సామాన్య భక్తులకు ఎటువంటి భారం పడకూడదు అని చెప్పిన మాటను కట్ చేసి దుష్ప్రచారంలో భాగంగా వాడుకుంటున్నారు దుండగులు. అది కూడా టీటీడీ బోర్డు సమావేశంలో జరిగిన చర్చ మాత్రమే. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా కానేకాదంటున్నారు.