Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!

Nara Lokesh Jagan

Nara Lokesh Jagan

Nara Lokesh: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ‘మావిగన్’ రాజధానిపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. గతంలో అమరావతి, ఆ తర్వాత మూడు రాజధానులు అన్న జగన్.. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటున్నారని.. రేపు పొద్దున బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్ తా హై’ అంటారేమోనని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు లోకేష్… ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్ లోనే రాజకీయం ఉందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు మంచి చేస్తే ఎంతగా ప్రేమిస్తారో, మోసం చేస్తే అంతకంటే ఘోరంగా జీరో చేస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీకి ఎలా బుద్ధి చెప్పారో అందరూ చూశారన్నారు.

చిత్తూరు జిల్లా వైసీపీలో లిక్కర్ స్కామ్, గంజాయి, ఎర్రచందనం, టీడీఆర్ బాండ్ల స్కామ్ లు చేసే దొంగలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్.. అదే సమయంలో టీడీపీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, శివప్రసాద్ రామకృష్ణారెడ్డి లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారని గుర్తు చేశారు. టీడీపీకి యువత, రైతు, మహిళలు, యూనియన్లు అనుబంధ విభాగాలుగా ఉంటే.. గొడ్డలి పార్టీకి మాత్రం గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సైకో బ్యాచ్‌లే అనుబంధ విభాగాలుగా ఉన్నాయని విమర్శించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎప్పటికీ టీడీపీకి కంచుకోట అని కాని ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ కి స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ కూడా ఉంది. దానివల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతుంటాయి. నా పాదయాత్రలో కూడా సుధీర్ రెడ్డి నా స్పీడును అందుకోలేకపోయాడు” అంటూ నవ్వులు పూయించారు. తప్పులు చేసిన వారిపై ఎర్ర బుక్కు తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన వెన్నెముక అని, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌..