తిరుపతి జిల్లాలోని తవణంపల్లి మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్తో పాటు, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి!
పోలీసుల కథనం ప్రకారం.. మోదలపల్లి గ్రామానికి చెందిన యువరాజ్ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన లవకుమార్ అనే మరో యువకుడు సదరు యువతితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లు , డీపీలుగా పెట్టుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి ఫోటోలు దిగడమే కాకుండా, వాటిని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై యువరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో లవకుమార్ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, అతడిని అంతం చేయాలని యువరాజ్ పథకం వేశాడు.
ఈ నెల ఒకటో తేదీన రాత్రి యువరాజ్ తన వద్ద పనిచేసే ఒక మైనర్ బాలుడితో కలిసి లవకుమార్ను కొత్త చెరువు వద్దకు పిలిపించాడు. అక్కడ పథకం ప్రకారం లవకుమార్కు భారీగా మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేశాడు. లవకుమార్ పూర్తిగా స్పృహ కోల్పోయిన సమయంలో, యువరాజ్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్తో అతని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఎవరికీ దొరకకూడదని, గుర్తుపట్టలేని విధంగా డీకాంపోజ్ కావాలని భావించి సమీపంలోని చెరువులో పడవేశారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తవణంపల్లి పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి కాల్ డేటా , సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా యువరాజ్పై అనుమానం కలిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.