తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ఐదేళ్ల పాటు.. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎం పీఠం అధిరోహించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది నేతల్లో సగానికి సగం పైగా టీడీపీ ఆనవాళ్లు ఉన్నవాళ్లే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతగా పనిచేశారు. చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకున్నారు. అయితే గత 40 ఏళ్లలో టీడీపీ ప్రస్థానం అనేక ఆటుపోట్లకు గురైంది. ముఖ్యంగా తెలంగాణ విభజన తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యింది. ఏపీలోనూ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలోనే ఉంది. 2019 ఎన్నికలు టీడీపీ భవిష్యత్ను ప్రశ్నార్థకం చేశాయనే చెప్పవచ్చు.
అయితే 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించే పనిలో చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన పార్టీ అధికారంలోకి రావాలంటే ప్లానింగ్ మాములుగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం టీడీపీలో సీనియర్లు అంతంతమాత్రంగానే పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబుకు పలువురు సూచిస్తున్నారు.
కింజారపు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, వంగవీటి రాధా లాంటి యువనేతలు టీడీపీకి అవసరమని.. వాళ్లు వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ప్రతిపక్షం టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరించాలని పలువురు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా చంద్రబాబును మళ్లీ సీఎం హోదాలో చూడాలని తెలుగు తమ్ముళ్లు తెగ ఆరాటపడుతున్నారు.