Sajjala Ramakrishna Reddy: ఈ నెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, విద్యార్ధి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్ధి నాయకులు, మేధావులు, విద్యారంగ ప్రముఖులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని తెలిపారు. ఫీజు రీఇంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాడదామని సజ్జల వెల్లడించారు.
Read Also: Madhya Pradesh: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పు్
ఇక, అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు మెమోరాండంను సమర్పించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరులో యువత, విద్యార్ధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇక, రాష్ట్రంలోని 13 యూనివర్శిటీల నుంచి వీలైనంతమంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేయాలి అన్నారు. రేపు (11.03.2025) యూనివర్శిటీల లోపల లేదా బయట యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్ధను ఎలా నిర్వీర్యం చేసిందో వివరించాలన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్ధ ఎలా ఉంది.. ఆ తర్వాత విద్యార్ధి, యువత ఎలా నష్టపోయిందనే అంశాలు వారికి తెలియజేయాలన్నారు. ఆ తర్వాత 12న జరిగే యువత పోరు నిరసన కార్యక్రమంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నుంచి విద్యార్ధులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి వారి డిమాండ్లు వినిపించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైనప్పుడే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని సజ్జల చెప్పుకొచ్చారు.