Dharmana Krishnadas: ‘ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే’.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Dharmana Krishnadas

Dharmana Krishnadas

Dharmana Krishnadas: శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, బుడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ములాఖాత్‌లో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందని విమర్శించారు.

సీదిరి అప్పలరాజు అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ట అని ధర్మాన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనను హత్య కేసుగా చిత్రీకరించి తండ్రి, కుమారుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హోంమంత్రి, మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలిపై కూడా ధర్మాన విమర్శలు గుప్పించారు. పలాస ప్రాంతమంతా పోలీసులు మోహరించి ఎవరినీ వెళ్లనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అప్పలరాజు అయితే రేపు తాను, ఎల్లుండి బుడి ముత్యాల నాయుడు లక్ష్యంగా మారవచ్చని వ్యాఖ్యానించారు. అయితే కేసులకు, జైళ్లకు వైసీపీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు.

మాజీ ఉపముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు రోడ్లపై భారీగా మోహరించి వైసీపీ నాయకులను ముందుగానే అడ్డుకున్నారని తెలిపారు. చిన్న ఘటనలను పెద్దవిగా చూపిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. రోడ్డు ప్రమాదాలు సహజంగా జరుగుతుంటాయని, వాటిని ఉద్దేశపూర్వక నేరాలుగా మార్చి సీదిరి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్పేందుకు, పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడానికే తాము జైలుకు వచ్చామని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ, సీదిరి అప్పలరాజు అరెస్ట్ అక్రమమనే విషయం అందరికీ తెలుసన్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం దురదృష్టకరమే అయినప్పటికీ, రోడ్డు ప్రమాద కేసులో సెక్షన్ 105 ఎలా వర్తింపజేస్తారో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని రవిబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నప్పటికీ వాటికి పార్టీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, ఈ తరహా అక్రమ కేసులతో సీదిరి అప్పలరాజును భయపెట్టలేరని అన్నారు.