ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి అధికార పార్టీ నేతల మాటలే సాక్ష్యాలన్న ఆయన.. నేటి ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వక పంచాయతీ రాజ్ శాఖలో పనులు నిలిచిపోయాయన్నారు. 15 శాతం కమిషన్ ఇస్తే తప్ప కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించిన ఆయన.. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. స్టేట్ షేర్ కింద 10 శాతం కూడా కట్టలేని స్థితిలో రాష్ట్రం ఉందని.. రోడ్లు ఇంత దారుణంగా ఉంటే.. వచ్చే ఏడాదికి రోడ్లు వేస్తామని మంత్రి ఎలా చెబుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ మూత పడింది… ఆర్ధిక మంత్రి బుగ్గన రెస్టులోకి వెళ్లిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.