విశాఖలోని సింహాద్రి ఎన్టీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నాలుగు యూనిట్లలో ఒకేసారి గ్రిడ్ వైఫల్యం చెందడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఈ ఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. భారీగా వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా గాజువాక, కాలపాకలో సబ్స్టేషన్లు ట్రిప్ అయ్యాయని ఎన్టీపీసీ వెల్లడించింది. దీంతో సింహాద్రిలోని నాలుగు యూనిట్లలోనూ ట్రిప్ అయి 2వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొంది.
ప్రస్తుతం నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ను సరఫరా చేస్తున్నామని ఎన్టీపీసీ తెలిపింది. 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమయ్యాయని.. 2,4 యూనిట్లలో మరమ్మతులు మంగళవారం సాయంత్రానికి పూర్తవుతాయని ఎన్టీపీసీ యాజమాన్యం వివరించింది. మరమ్మతులు పూర్తయిన అనంతరం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొంది. కాగా ఓకేసారి నాలుగు యూనిట్లలో గ్రిడ్ విఫలం కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆధారమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్కు ఎన్టీపీసీ గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.