Missing Case: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం అయ్యింది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ తెలికపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బద్వేల్ మండలం ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి రవణమ్మ కుమార్తె వెంకట సంజన బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూలులో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వచ్చిన వెంకట సంజన తిరిగి స్కూల్కు వెళ్ళక పోవడంతో స్కూల్ సిబ్బంది తల్లి రవనమ్మకు సమాచారం అందించారు.
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి
సంజన కుటుంబసభ్యులు బద్వేల్ పట్టణంలోని తమ బంధువులను, స్నేహితులను విచారించగా ఎక్కడా సంజన ఆచూకీ తెలియక పోవడంతో బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. సంజన స్కూల్ నుంచి బయటకు వెళుతున్న మార్గంలో సీసీ టీవీలను పోలీసులు పరిశీలించగా ఒక చోట కనిపించింది. అయితే ఆ తర్వాత ఎలా వెళ్లిందో పోలీసులకు ఆనవాళ్లు దొరకట్లేదు. పోలీసులు మూడు రోజులుగా వెతుకులాట సాగిస్తున్నా.. వెంకట సంజన ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.