మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా అనేది రాష్ట్ర బీజేపీ చెప్పాలన్నారు. రూ. 3.20లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటుందని, దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందన్నారు. మీరు నామమాత్రం తగ్గించి రాష్ట్రాలు తగ్గించాలి అంటే రాష్ట్రాలు ఎలా బతకాలని కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాలకు చట్టప్రకారం 41 శాతం మేర తగ్గించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ గురించి మాట్లాడిన సజ్జల.. అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ.. 2014-19లో జరిగిన ఉప ఎన్నికల్లో వారి దౌర్జన్యం ఎలా ఉందో చూడొచ్చన్నారు. ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. బలవంతపు ఉపసంహరణలు ఎవరికి అవసరం…? మాకైతే అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎవర్ని బెదిరించలేరని అది కేవలం ఒక్క టీడీపీకే సాధ్యమవు తుందన్నారు. కుప్పంలో ఓడిపోవడం ఖాయం కాబట్టే చంద్రబాబు పెడ బొబ్బలు పెడుతున్నాడని సజ్జల ఆరోపించారు. అనంతపురంలో రాళ్లు వేశారు… ఓ అమ్మాయికి దెబ్బలు తగిలాయి. అక్కడ కొన్ని శక్తులు దూరినట్లు సమాచారం ఉందని, ఇలా కావాలనే చేస్తున్నా రన్నారు. లోకేష్ దీన్ని ఒక ఉద్యమంలా చేయాలని అనుకుం టున్నాడన్నారు.
2,249 ఎయిడెడ్ సంస్థలు ఉంటే….702 సంస్థలు వాళ్లే నడిపి స్తున్నారని ఇక్కడ ఏమీ బలవంతం చేయడం లేదనే దానికి ఇదే నిదర్శనమని సజ్జల పేర్కొన్నారు. 101 సంస్థలు స్వచ్చంధంగా ప్రభుత్వానికి ఇచ్చారు. వాటిలో మళ్లీ వెనక్కి అడుగుతున్నారన్నారు. టీచర్లు, యాజమాన్యం కలిసి వచ్చిన చోట మాత్రమే ప్రభుత్వం ఆ సంస్థలన తీసుకున్నదన్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమిటి..? ఆందోళన చేయడంలో రాజకీయ పార్టీలకు వచ్చే ప్రయోజనం ఏమిటి..? ఎయిడెడ్ విషయంలో ఎలాంటి బలవంతం చేయడం లేదని, టీచర్లు చాలా ఆనందంగా ఉన్నారు… అబద్ధపు విష ప్రచారాన్ని నమ్మొద్దు అని సజ్జల తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు సామాజిక న్యాయంతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.