Site icon NTV Telugu

Daggubati Purandeswari: పురందేశ్వరికి బీజేపీ షాక్.. కీలక పదవుల నుంచి తొలగింపు

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: బీజేపీ పార్టీ పురందేశ్వరికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం. ఒడిశా రాష్ట్రంలో పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒడిశా రాష్ట్రంలో ఇంఛార్జుగా ఉన్న పురందేశ్వరిని సహ ఇంఛార్జికి పరిమితం చేసింది. పురందేశ్వరీ వ్యవహార శైలిపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు.. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

పురందేశ్వరి అధ్యక్షతన “ఏపిలో విస్తృత చేరికల కమిటీ” ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో బీజేపీ అగ్రనాయకత్తం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు ఎవరికి ఇవ్వని రీతిలో ప్రాధాన్యత ఇచ్చినా ప్రయోజనం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Also: Dy Cm Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

పురందేశ్వరికి బీజేపీలో మంచి గౌరవం ఇచ్చినా, చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదని గ్రహించింది బిజేపి అగ్రనాయకత్వం. అమిత్ షాతో సహా.. బీజేపీ పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా.. ఒక్కసారి కూడా “విస్తృత చేరికల కమిటీ” సమావేశాన్ని నిర్వహించకపోవడంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. అంతకుముందు ఎన్టీఆర్ కుమార్తె కావడంతో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావించింది. అయితే చేరికల విషయంలో పురందేశ్వరి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీజేపీ భావిస్తోంది.

పురందేశ్వరి కి బిజేపి లో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించినా, తన తండ్రి స్థాపించిన “తెలుగు దేశం పార్టీ” (టి.డి.పి) నుంచి వలసలను ప్రోత్సహించడంలో అనాసక్తిగా వ్యవహరిస్తున్నారని జాతీయ నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా పురందేశ్వరీ టీడీపీకి దగ్గరయ్యే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీతో పాటు ఏ ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి వలసలను ప్రోత్సహించలేదని పార్టీ అధినాయత్వం భావిస్తోంది. దీంతోనే పురందేశ్వరిని కీలక బాధ్యతల నుంచి బీజేపీ తప్పించింది.

Exit mobile version