Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని, ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని ఆకాంక్షించారు.
Read Also: Venky 75: ‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని.. అమ్మవారి చల్లనిచూపు ప్రజలపై ఉంటుందని తెలిపారు. మంగళవాయిద్యాలే మనకు బలమన్నారు. ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. పుణ్యక్షేత్రం కాబట్టి ఇంతకుమించి మాట్లాడటం సరికాదన్నారు. కాగా దుర్గమ్మ దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు. జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలకు అనుమతించలేదు. అటు పవన్ విజయవాడ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు తన అభిమానులకు వారాహి ఎక్కి పవన్ నమస్కారాలు తెలియజేశాడు.