రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అని నిలదీసిన ఆయన.. వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణంగా తెలిపారు పవన్ కల్యాణ్… మరోవైపు.. పోలీసుశాఖలో 11 నెలల నుంచి టీఏలు కూడా చెల్లించలేదని విమర్శించిన జనసేనాని… ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం లేదని మండిపడ్డారు.. జీతం వస్తే అదే పదివేలు అనుకుంటారనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమై పోతున్నాయి..? అంటూ ప్రశ్నించారు.
ఇక, వైపీసీ ప్రభుత్వం అన్నీ తాకట్టు పెడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా జనసేనాని ఫైర్ అయిన సంగతి తెలిసిందే.. ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా .. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు అంటూ ఉదయం ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది అంటూ ఎద్దేవా చేశారు.