ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ ప్రకటించిన తర్వాత… ప్రజలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు, బీజేపీ విద్యుత్ ఛార్జీలపై పోరాటానికి దిగుతుండగా… ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇందులో చేరింది.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆయన.. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది అంటూ ఎద్దేవా చేశారు.. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు జనసేనాని.
Read Also: Telangana: మద్యం అమ్మకాల జోరు.. రూ.30,711 కోట్లు తాగేశారు..
ఆదాయం లేదు… రాబడి లేదు… ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారని ఫైర్ అయ్యారు పవన్.. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ పై అధిక వ్యాట్, లిక్కర్ పై అయితే సరే సరే అని.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారని ఆరోపించిన ఆయన.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది? అంటూ నిలదీశారు.. పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్.. ఆ మాటను మరిచిపోయారని మండిపడ్డ పవన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న మనం… ఇవాళ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. గ్రామాల్లో 3 నుంచి 6 వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన మీరే… ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలి? బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో మీరే చెప్పండి..? అని నిలదీశారు. ఇక, పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని ప్రకటించారు. తెల్లారిందంటే చాలు… జగన్ ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అన్నారు.. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.