NTV Telugu Site icon

Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి

Pawan Kalyan

Pawan Kalyan

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థిక మేలు చేకూరుస్తుందని తెలిపారు.

పెట్రోల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని పవన్ ఆరోపించారు. అసలే అస్తవ్యస్థమైపోయిన రోడ్లతో ఏపీ ప్రజల ప్రయాణం భారంగా మారిందని.. వాహనాలు మరమ్మతులకు లోనై ప్రజలు అల్లాడిపోతున్నారని పవన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా జగన్ సర్కారు రూ.600 కోట్లు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదన్నారు. కనీసం పెట్రోలు, డీజిల్‌పై స్థానిక పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని పవన్ హితవు పలికారు.

మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్లు ట్వీట్‌లో వివరించారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.