NTV Telugu Site icon

Pawan Kalyan: ఎమ్మెల్యే ఆనం రక్షణ బాధ్యత డీజీపీదే..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి అధిష్టానం అప్పగించినప్పటి నుంచి పార్టీకి.. ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్‌ పెరుగుతూనే ఉంది.. ఇక, తన భద్రతను కుదించడంపై ఆన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయంటూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేనాని.. ఆనం రామనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని ఆరోపించిన పవన్.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా అయిన రాజకీయ నాయకుడిగా పేరున్న ఆనం రామనారాయణ రెడ్డే ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

Read Also: Posani Krishna Murali: ఏపీఎఫ్ డిసి చైర్మైన్ గా బాధ్యతలు స్వీకరించిన పోసాని

శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయని విమర్శించారు పవన్‌.. మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉందన్న ఆయన.. ప్రభుత్వ వ్యవహార శైలి గురించీ, తన నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం గురించీ రామనారాయణ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరం అని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారని మండిపడ్డారు. ఆనంకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు.. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలని తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆనంకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి.. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తానన్నారు.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారు., అలాగే స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదన్న పవన్.. సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. రామనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన, శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.