Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?

Social Boycott

Social Boycott

Social Boycott: ఎన్టీఆర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటతో పాటు వారి కుటుంబాన్ని సామాజికంగా వెలివేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి ప్రేమించి వివాహం చేసుకోవడంతో గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని అంగీకరించని కుల పెద్దలు, ఆ జంట కుటుంబాన్ని గ్రామం నుంచి దూరం పెట్టేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్లకూడదని, వారు వచ్చినా రానివ్వకూడదని గ్రామంలో చాటింపులు చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా గ్రామ పెద్దల తీర్పును ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు కూడా ఆ కుటుంబానికి సహాయ నిరాకరణ చేస్తూ దూరంగా ఉంటున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రేమ జంట తేజ, నాగలక్ష్మి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబానికి మాత్రం గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆ జంటకు బాబు పుట్టడంతో బారసాల వేడుక నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ఎవరూ వెళ్లకూడదని గ్రామ పెద్దలు మరోసారి ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బారసాల వేడుకకు రావాలని గ్రామస్తులను స్వయంగా ఆహ్వానించేందుకు గ్రామంలోకి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని, గ్రామ తీర్పును ఉల్లంఘించారని చెబుతూ రూ.2 లక్షలు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబం మైలవరం పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం అనాగరిక చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు.