అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వరదలు, భూకంపాల ముప్పు ఉందని ప్రచారం చేశారని.. ప్రభుత్వంలోకి వచ్చాక స్మశానం అన్నారని లోకేష్ ఆరోపించారు. అమరావతిపై జగన్ కుట్రలకు అంతం లేదని విమర్శించారు.
విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి భూకంప ప్రమాదం, ముంపు ముప్పు అని ప్రచారం చేశారు. ప్రభుత్వంలోకొచ్చాక శ్మశానం అన్నారు. నేడు ఎకరం 10 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అమ్మ లాంటి అమరావతిపై జగన్ మోసపు రెడ్డి కుట్రలకు అంతం లేదు. pic.twitter.com/r4ODe0Ycnn
— Lokesh Nara (@naralokesh) June 26, 2022
మరోవైపు రాజధాని రైతులు కూడా ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గ్రూప్-డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాన్ని అద్దెకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఆనాడు రాజధానిని గ్రాఫిక్స్ అంటూ అవహేళన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వాటిని అద్దెకు ఎలా ఇవ్వాలని భావిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వాలనుకోవడం దారుణమన్నారు. అమ్ముకోవడం, అద్దెకు ఇచ్చుకోవడం, తనఖా పెట్టడం తప్ప ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని చురకలు అంటించారు.
Andhra Pradesh: అమరావతిలో భవనాల లీజు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్