విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు.
వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు గురవడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. గ్యాస్ లీక్ కి కారణమైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వ స్పందన శూన్యం. పోయిన ప్రాణాలకి కోటి పరిహారం ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు సీఎం గారూ..! మరో ప్రాణం పోకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. మరోవైపు గ్యాస్ లీకేజీ బాధితులు ఆస్పత్రులకు వస్తూనే వున్నారు. గ్యాస్ లీక్ బాధితుల కు మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. నిపుణులైన వైద్యులను వివిధ ఆసుపత్రుల నుంచి రప్పిస్తున్నారు అధికారులు. ప్రతీ వార్డుకు ఒక్కో స్పెషాలిస్ట్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికీ అనకాపల్లి ఆసుపత్రికి బాధితులు వస్తుండడంతో అక్కడ బెడ్ లు సరిపోవడం లేదు. మంత్రులు అమర్నాథ్, ముత్యాలనాయుడు బాధితులకు అందుతున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్