Srisailam Temple Ghee Controversy: ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది. అయితే 2022 మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కనపెట్టి, రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి నెయ్యి సరఫరాకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also: sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
ప్రత్యేకంగా, రాజేష్ కార్పొరేషన్కు సొంత డైరీ లేకపోవడం, ఇతర సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేసి ఆలయానికి సరఫరా చేసినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజేష్ కార్పొరేషన్ సంస్థ బోలే బాబా డైరీ నెయ్యినే కొనుగోలు చేసి, అదే నెయ్యిని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, తిరుమల నెయ్యి వివాదంలో బోలే బాబా డైరీ పేరు వినిపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికారుల సమాచారం ప్రకారం, 2022 మే నుంచి 2023 మార్చి వరకు మొత్తం 11 నెలల కాలంలో రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలానికి 3,25,064 కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఈ పరిమాణం పెద్దదిగా ఉండటంతో, నెయ్యి నాణ్యతపై మరింత లోతైన విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయోగశాల పరీక్షల్లో గానీ, అధికారిక విచారణలో గానీ ఇప్పటివరకు నెయ్యి కల్తీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. అలాగే, రాజేష్ కార్పొరేషన్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు. విజయ డైరీ లాంటి ప్రభుత్వ అనుబంధ సంస్థను కాదని, సొంత డైరీ లేని రాజేష్ కార్పొరేషన్కు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎలా దక్కిందన్న అంశంపై ఇప్పుడు పలు వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
