ఏపీ ప్రభుత్వం విక్రయించే వివిధ మద్యం బ్రాండ్లపై విపక్షాలు విమర్శలు చేస్తూనే వున్నాయి. దీనికి తోడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న రఘురామ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని లేఖ రాసింది.
రఘురామకృష్ణ రాజు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లలో ప్రమాదకర పదార్థాలు వాడుతున్నారని ఆరోపించారు. ఎస్జీఎస్ అనే కెమికల్ ల్యాబ్లో ఏపీలో విక్రయిస్తున్న మద్యానికి పరీక్షలు నిర్వహించగా అందులో ప్రమాదకర పదార్థాలు ఉన్న విషయం వెలుగుచూసినట్టు పేర్కొన్నారు. స్పందించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిన్న రఘురామకు లేఖ రాస్తూ.. ఆ పరీక్షల వివరాలను ఇవ్వాలని కోరారు. దీనికి రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.