తాను పవన్‌ అభిమానిని..! ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే ఈ మధ్యే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు తాను పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ను అంటూ కామెంట్లు చేసి కొత్త చర్చకు తెరలేపారు.. ఇవాళ ఉదయం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17న విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. సీఐడీ అధికారులపై మండిపడ్డారు.. గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాను అన్నారు. ఇక, సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది.. అంటూ మండిపడ్డారు.

Read Also: సమాచార శాఖ ట్విట్టర్‌నూ వదలని హ్యాకర్స్..

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావన కూడా తెచ్చారు రఘురామ కృష్ణరాజు.. తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పుకొచ్చిన ఆయన.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని అంటూ.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ఓ సినిమాలోని డైలాగ్‌ను రిపీట్‌ చేశారు. అయితే, ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఈ మధ్యే ప్రకటించిన వైసీపీ రెబల్‌ నేత అడుగులు జనసేన వైపు ఏమైనా పడుతున్నాయా? అనే కోణంలోనూ చూస్తున్నారు. అందుకే పవన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో రాజుగారు పడిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. తాను వైసీపీలో ఉన్నా.. తర్వాత రెబల్‌గా మారినా.. గెలిచినా పార్టీని, పార్టీ అధినేతను టార్గెట్‌ చేసినా.. కేంద్రంలోని పెద్దలతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చన రఘురామ.. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీని కూడా ఆకర్షించే పనిలో పడిపోయినట్టుగా ఉంది. మరి.. నరసాపురం రాజకీయాలు ఏ సమయంలో ఎలాంటి మలుపు తీసుకుంటాయే అనేది ఆసక్తికరంగా మారింది.