తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో.. ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్కే దక్కనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7,మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే.