Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రానికి రూ.40లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అప్పటి మంత్రి లోకేష్ చెప్పారని.. ఇప్పుడు ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్లాయా అని చురకలు అంటించారు. రికార్డుల్లో 14 కంపెనీలు వచ్చినట్టు చూపారని.. అవి ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.
Read Also: Super Star Krishna: కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది.. సంచలన నిజాలు వెలుగులోకి..?
రాని పరిశ్రమలు వచ్చాయని టీడీపీ నేతలు కట్టు కథలు చెప్పారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాకీ కోసం రూ.140 కోట్లు విలువైన భూమిని రూ. 2.5 కోట్లకు సేల్ డీడ్ చేశారని.. మరి ఆ రోజు పరిశ్రమ ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. పరిటాల సునీత అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారని.. 2018 అక్టోబర్లోనే ఉత్పత్తి, ట్రైనింగ్ ప్రారంభించాలని ఒప్పందంలో ఉందని.. కాంపౌండ్ వాల్ సగంలోని ఎందుకు ఆపేశారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులు తిరుపూరు, బెంగళూరులో నాలుగు యూనిట్లు మూసివేశారని.. ఇలాగే రాప్తాడులో కూడా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని వివరించారు. ఈ రోజు కూడా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదని.. భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూములు తీసుకున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని.. మార్కెట్ ధరకు తాము భూములు కేటాయిస్తున్నామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కనీసం 12సంవత్సరాలు ప్రొడక్షన్ ఉంటే భూమి అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పారు.