జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కొడాలి నాని.. కమ్మలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అనటం సిగ్గు లేనితనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, చంద్రబాబుకు అండగా ఉంటాను అంటున్నాడు.. కమ్మ కులం అంటే ఈ నలుగురే అనుకుంటున్నాడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఏ రాజకీయ నాయకుడు అయినా పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామంటారు.. కానీ, ఇంత హీనంగా మాట్లాడే పవన్ కల్యాణ్, జనసేనను ప్రజలు పాతాళంలో పాతిపెడతారు అంటూ హెచ్చరించారు. ఇక, ఏ కమ్మ వ్యక్తి పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అడిగాడో చెప్పాలని డిమాండ్ చేసిన కొడాలి నాని.. సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి ఒకరైనా మా కులంలో పుడితే బాగుండేది కమ్మవాళ్లు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. యుద్ధం చేయగలిగే మగాడు అని వైఎస్ జగన్ను నమ్మారు కనుకే ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు మంత్రి కొడాలి నాని.. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే వ్యక్తులను ఎవరు నమ్ముతారు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఎప్పుడు ఎవరిని ముంచుతారో తెలియని వాళ్లకు విశ్వసనీయత ఉండదన్నారు. ఇక, డ్వాక్రా సంఘాలను చంద్రబాబు పెట్టానంటున్నాడు.. పీవీ నర్సింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టారని వెల్లడించారు. చరిత్ర ప్రజలకు తెలియదనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలను డిఫాల్టర్ సంఘాలుగా మార్చింది చంద్రబాబేనని ఆరోపించిన మంత్రి కొడాలి నాని.. డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పును నాలుగు విడతల్లో తీరుస్తానని మాటిచ్చిన నేత జగన్ అని.. ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల్లో డబ్బును వారి ఖాతాల్లో వేశారని ప్రశంసలు కురిపించారు. కానీ, పేద మహిళల నుంచి డబ్బులు దండుకున్న లుచ్చా చంద్రబాబు అంటూ మండిపడ్డ ఆయన.. రెండు లక్షల కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపదను కుక్కల పాలు చేశారని చంద్రబాబు అంటున్నాడని.. లక్ష కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకు ఇచ్చి అండగా నిలబడితే… పేద తల్లులు, రైతన్నలు అందరినీ చంద్రబాబు కుక్కలు అని విమర్శిస్తున్నాడంటే ఎంత అహంకారం ఉందో అర్థం అవుతుందన్నారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు.. సీఎం జగన్ పంజా దెబ్బలు చంద్రబాబు జీవితాంతం తింటాడు అంటూ కామెంట్ చేశారు మంత్రి కొడాలి నాని.