Kakani Govardhan Reddy: బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎవడో అనామకుడు తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే జిరాక్స్ కాపీ స్టిక్కర్ను వాడారని.. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఏమి ఆధారం లేకుండా గోవర్ధన్ రెడ్డి ఆర్గనైజ్ చేశాడు అని సోమిరెడ్డి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్ నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని.. ఎవరు అయినా వెళ్లి చూసుకోవచ్చన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Pinnelli Ramakrishna Reddy: మేము ఎటువంటి దాడులు చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం
సోమిరెడ్డి చంద్రమోహన్ బతుకు ఏంటో నెల్లూరు ప్రజలకు తెలుసన్నారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం.. ఎవరు రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరారు. బెంగుళూరులో రేవ్ పార్టీ వ్యవహారంపై తాను సీబీఐ విచారణకు కూడా సిద్ధమన్నారు. చంద్ర మోహన్ రెడ్డి నోటికి, సెప్టిక్ ట్యాంక్కు తేడా లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. రేవ్ పార్టీపై ఎటువంటి విచారణకు అయిన తాను సిద్ధమన్నారు. రేవ్ పార్టీలో చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బెంగుళూరు పోలీసుల నుంచి ఎటువంటి కాల్ రాలేదన్నారు. ఆ ఫార్మ్ హౌస్ ఓనర్ ఎవరో కూడా తనకు తెలియదని.. కుట్ర కోణం ఏమైనా ఉందా విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరామన్నారు.