Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూస్తే తమకు భయం ఎందుకని.. సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరైన మనిషి జగన్ అని తెలిపారు. టీడీపీ పడిపోయిన పార్టీ అని.. మోపులు కట్టినా.. బుల్డోజర్లు కట్టి లాగినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. దత్తపుత్రుడు వచ్చినా ఆ పార్టీని మళ్లీ లేపలేడని జోగి రమేష్ అన్నారు.
Read Also: Nitin Gadkari : తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి
మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఒక పద్ధతి, నిబంధనలు ఉండవన్నారు. కుప్పం ప్రజల ప్రాణాలు తీయాలని చంద్రబాబు చూస్తున్నారని.. దేశంలో ఎక్కడైనా 1861 పోలీస్ యాక్టునే ఫాలో అవుతున్నారని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబు ఏమైనా సొంత చట్టాలు తయారుచేసుకున్నారా అని నిలదీశారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. నిత్యానంద స్వామిలా చంద్రబాబు కూడా ఒక దీవి కొనుగోలు చేసి ఉండాలని చురకలు అంటించారు. చంద్రబాబు ఏది పడితే అది చేస్తామంటే కుదరదన్నారు. అటు ఒక ఓటు గానీ సీటు గానీ లేని బీజేపీ గురించి ఏం మాట్లాడతామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అస్థిత్వం కోసం కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఒకటి మాట్లాడతారని ఆరోపించారు.