ఏపీలో పీఆర్సీ పై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా ఎన్టీవీ తో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు వల్లే చలో విజయవాడకు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదని, చలో విజయవాడ ను పాజిటివ్ గానూ చూడటం లేదు… నెగెటివ్ చూడటం లేదని ఆయన అన్నారు. బంతి ఉద్యోగ సంఘాల కోర్టు లోనే ఉందని, ప్రభుత్వం చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన వెల్లడించారు.
జీవోల్లో సవరణలు చేయవచ్చు కానీ పూర్తిగా రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని పట్టుబట్టడం కరెక్ట్ కాదని, ప్రభుత్వానికి బాధ్యత ఉంది కనుకే అడగకుండానే 27శాతం ఐఆర్ ఇచ్చిందని ఆయన అన్నారు. సమ్మె ఎవరి మీద చేస్తారు? సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడితే…ఆ ప్రజల్లో వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా ఉంటారు అని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల పై సమ్మె చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.