సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో తనపై దాడి చేసి అక్రమ కేసు బనాయించారని వాపోయాడు. ఇదే విషయాన్ని చిలమత్తూరు ఎస్ఐ రంగడు దృష్టికి తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. మద్యం మత్తులో ఉన్న వేణు సంజీవరాయనిపల్లెలో న్యూసెన్స్ చేస్తుండగా కానిస్టేబుల్ అడ్డుపడ్డాడని.. అడ్డుపడ్డ కానిస్టేబుల్పై వేణు తిరగబడ్డాడని.. ఈ విషయంలోనే తాము మందలించామని పోలీసులు చెప్తున్నారు. కాగా యువకుడిపై ఎస్సై దాడి చేసిన వీడియో బయటకు రాగా ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పెనుకొండ డీఎస్పీ రమ్యను విచారణ అధికారిగా నియమించారు.